Rains Alert | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్, పరిసర ప్రాంతాల్లో సగుట సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉందని తెలిపింది. దాంతో బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు భారీ వర్షాలు పడేందుకు అవకాశాలున్నాయని చెప్పింది. వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్, జనగాంతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.