హైదరాబాద్ : రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది వాతావరణ కేంద్రం. బుధ, శనివారం రోజుల్లో ఎల్లో అలెర్ట్, గురు, శుక్రవారాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గురువారం రోజు హైదరాబాద్కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
మంగళవారం రోజు నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 70.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, మహబూబ్నగర్ జిల్లాలో 60.4 మి.మీ., జోగులాంబ గద్వాల జిల్లాలో 51.6 మి.మీ., మంచిర్యాల జిల్లాలో 45.2 మి.మీ., పెద్దపల్లిలో 42 మి.మీ. వర్షపాతం నమోదైంది.