Heavy Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. మంగళవారం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. బుధవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది.
శుక్రవారం ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ణగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో.. శనివారం వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా గడిచిన 24గంటల్లో హైదరాబాద్ జంటనగరాలు సహా పలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో 15.1 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే, షేక్పేటలో 12.4, ఖైరతాబాద్లో 11 సెంటీమీటర్ల భారీ వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.