హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భక్తజన సంద్రమైంది. కార్తిక మాసంతోపాటు వరుస సెలవులు రావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి 4 గంటలు, రూ.300 టికెట్ దర్శనానికి రెండు గంటలు పట్టింది.
భక్తుల రద్దీతో వసతి సముదాయాలన్నీ నిండిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు, సొంత వాహనాలు భారీగా రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలం టోల్గేట్ నుంచి సాక్షిగణపతి ఆలయ ముఖద్వారం వరకు వాహనాలు నిలిచిపోయాయి.