హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలోని పరివాహక ప్రాంతా ల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ, గోదావరి నదులకు వరద పోటెత్తుతున్నది. భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టులకు ప్రవా హం క్రమంగా పెరుగుతున్నది. సోమవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. విద్యుదుత్పత్తితోపాటు 20 గేట్లను మీటర్ మేర ఎత్తి 1.4 1లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుతం 8.651 టీఎంసీలున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 47,069 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా 25,427 క్యూసెక్కులను సాగర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 873.70 అడుగుల వద్ద నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. మూసీ ప్రాజెక్టుకు 7,490 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పరిధిలోని డిండి ప్రాజెక్టు నిండుకుండలా మారి అలుగు పారుతున్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు 12,824 క్యూసెక్కులు ఇన్ఫ్లో, 17వేల క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలకు ప్రస్తుతం 100.624 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నది.
ఎస్సారెస్పీ 30 గేట్లు ఎత్తివేత
మహారాష్ట్ర లోని విష్ణుపురి, మాలేగావ్ ప్రాజెక్టులతోపాటు నిజామాబాద్, నిర్మల్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1.14 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ప్రాజెక్టు 30 గేట్లను ఎత్తి 1.65 లక్షల క్యూసెక్కుల జలాలను గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 1090 అడుగుల (84.81 టీఎంసీలు) వద్ద ఉన్నది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ఈ సీజన్లో 174.376 టీఎంసీల వదర వచ్చి చేరినట్లు ఈఈ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతీ బరాజ్కు 3.38 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 2.34 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదయ్యింది. 10.87 టీఎంసీలకు ప్రస్తుతం 3.25 టీఎంసీల నీరుంది. అలాగే లక్ష్మీ బరాజ్లో 3.86లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 3.77 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉన్నది. కాళేశ్వరం పుష్కరఘాట్ను ఆనుకొని 9.01 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది.
సింగూరు నీటి విడుదల
అందోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్ సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని, అన్నదాతల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు. సింగూరు నిండటంతో రెండేండ్ల వరకు ఆయకట్టుకు సాగునీటి పరంగా ఢోకా ఉండదనిచెప్పారు. సోమవారం సింగూరులోకి 33వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, ఔట్ఫ్లో 8,626 క్యూసెక్కుల ఉందని అధికారులు తెలిపారు.