TS Weather | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. మరో వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల రెండు రోజుల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ వడగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. అదే సమయంలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది.