హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణను మే 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనేలా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని.. ఆయన కొడుకు లోకేశ్ మాత్రం అధికారులను బెదిరించేలా మాట్లాడుతున్నారని తెలిపారు.
తాము అధికారంలోకి వస్తే దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని బెదిరిస్తున్నారని, ఈ అంశంపైనే ఇంటర్లొకేటరీ అప్లికేషన్- ఐఏ దాఖలు చేశామని చెప్పారు. హైకోర్టు విధించిన బెయిల్ షరతులను చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారని అన్నారు. చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్దార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తూ లోకేశ్ మాట్లాడితే.. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం సమర్పించిన ఐఏ తమ వద్ద లేదని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. దానిని రికార్డుల నుంచే తీసుకుంటామని తెలుపుతూ విచారణను వాయిదా వేశారు.