హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): వన్యమృగాల దాడుల నుంచి భక్తులను కాపాడేందుకు తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారిలో ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, అటవీశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డి దాఖలు చేసిన పిల్పై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచామని అటవీశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇనుప కంచె, అండర్ పాస్లు ఏర్పాటు చేయాలని డబ్ల్యూఐఐ నివేదిక ఇచ్చిందని పిటిషనర్ తరపు లాయర్ తెలిపారు. చిరుత దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి టీటీడీ తరపున రూ.10 లక్షలు, ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారం అందజేశారని టీటీడీ తరపు లాయర్ వెల్లడించారు. డబ్ల్యూఐఐ నివేదిక అమలుకు ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. భక్తుల భద్రత కోసం టీటీడీ తాత్కాలిక చర్యలు తీసుకున్నదని తెలిపారు. డబ్ల్యూఐఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ కార్యచరణ ఏమిటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్ రఘునందన్రావుతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. మరోసారి సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని స్పష్టంచేసింది. వన్యప్రాణులు స్వే చ్ఛగా తిరిగేందుకు ఎక్కడెక్కడ అండర్పాస్ లు, ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి.. భక్తుల భద్రత కోసం ఎంతమేర ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న విషయాలు డబ్ల్యూఐఐ నివేదికలో స్పష్టంగా లేవని అభిప్రాయపడింది. పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని చెప్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.