హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): చీమలు కుట్టినా అలర్జీ వస్తుందట! దేశంలోనే తొలిసారి ఈ విషయం నిర్ధారణ అయినట్టు అశ్వినీ అలర్జీ క్లినిక్ వైద్యుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్రావు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ ఐటీ ఉద్యోగి (28) తన ఇంట్లో గార్డెనింగ్ చేస్తున్నప్పుడు కాళ్లపై ఎర్రచీమలు కుట్టాయి. అరగంట తర్వాత ఆయనకు కంటి దురద, గొంతులో దురద, గొంతు మారడం, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదాలతోపాటు చెవి వద్ద వాపు రావడం, బీపీ తగ్గడం లాంటి సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు సమీపంలోని దవాఖానకు తరలించారు.
ఆయన అలర్జిక్ అర్టికేరియాతో బాధపడుతున్నట్టు వైద్యపరీక్షల్లో తేలడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు. దీంతో కోలుకున్న ఆ వ్యక్తిని 20 రోజుల తర్వాత ఇంట్లో చీమలు కుట్టడంతో మళ్లీ అవే సమస్యలు తలెత్తాయి. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్లోని అశ్విని అలర్జీ సెంటర్కు తీసుకురాగా.. ‘రెడ్ యాంట్ ఎలర్జీ’ బారిన పడినట్టు వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో ఆయనకు ఎర్ర చీమల ఇమ్యునో థెరపీని ప్రారంభించి ఎపిపెన్ (ఎస్ఒఎస్) ఇంజెక్షన్ ఇవ్వడంతోపాటు యాంటీ హిస్టమైన్స్, బ్రాంకో డిలేటర్ చికిత్సలు చేసినట్టు డాక్టర్ నాగేశ్వర్రావు వివరించారు. దేశంలో ‘రెడ్ యాంట్ అలర్జీ’ని గుర్తించడం ఇదే తొలిసారని, ఈ ఎలర్జీకి గురైనవారు సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు.