న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఉన్న 65 ఏండ్ల వయో పరిమితిని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) తొలగించింది. ఇక నుంచి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇంతకాలం 65 ఏండ్ల దాటిన వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు వీలుండేది కాదు. ఈ నిబంధనను తొలగిస్తూ ఇటీవల ఐఆర్డీఏఐ గెజిట్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చని పేర్కొన్నది. పిల్లలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, ఇలా అన్ని వయసుల వారికి, గర్భిణుల కోసం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్డీఏఐ ఆదేశించింది.
అనారోగ్య సమస్యలున్నా..
ముందే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వాలని సైతం ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. ఇంతకాలం క్యాన్సర్, ఎయిడ్స్, గుండెజబ్బులు వంటి సమస్యలు ఉన్న వారికి కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చేవి కావు. కాగా, ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కూడా పాలసీదారులకు ఇవ్వాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఆయుర్వేద, యోగా, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి చికిత్సకు కవరేజీలో ఎలాంటి పరిమితి విధించివద్దని, ఇన్సూరెన్స్ చేయించుకున్న మొత్తానికి కవరేజీ ఈ చికిత్సలకు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది.