వరంగల్ చౌరస్తా, జనవరి 28 : చారిత్రక వరంగల్ నగర నడిబొడ్డున రూ.1100 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వైద్య సేవల్లో దేశానికి రోల్ మాడల్గా నిలిచేలా వరంగల్లో హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతున్నదని మంత్రి చెప్పారు. శనివారం వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు రూ.1100 కోట్లు వెచ్చించి.. ఆర్అండ్బీ పర్యవేక్షణలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో వరంగల్లో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానను నిర్మిస్తున్నదని, ఈ పనులను ఎల్అండ్టీ సంస్థ చేపట్టిందని వివరించారు.
ఈ హాస్పిటల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. రానున్న దసరా నాటికి నిర్మాణం పూర్తి చేసి వైద్యసేవలను ప్రారంభించడానికి మూడు షిఫ్ట్లలో పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు పెట్టినపుడు అసలిది సాధ్యమేనా అని మాట్లాడినోళ్లు.. నేడు కాళేశ్వరం నీళ్లు తాగుతూ, అవే నీటితో పండిన పంట తింటున్నారని, నేడు శరవేగంగా జరుగుతున్న హెల్త్ సిటీ నిర్మాణ పనులను చూసి వారి కండ్లు బైర్లు కమ్ముతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. జనాభా ప్రాతిపదికన ప్రతి 19 మంది రోగులకు ఒక ఎంబీబీఎస్ వైద్యుడు అందుబాటులో ఉన్నాడని, రానున్న రోజుల్లో 33 జిల్లాలకు 33 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు.
ఒకే విద్యాసంవత్సరంలో 8 మెడికల్ కళాశాలల్లో వైద్య విద్యను ప్రారంభించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందని వివరించారు. త్వరలో 1300 ప్రాఫెసర్ల నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను విస్తృతం చేయడానికి 926 వైద్యుల పోస్టులను భర్తీ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.