హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు, డాక్టర్లతో ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఇవాళ సమీక్ష నిర్వహించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముంపునకు గురైన గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ముంపు గ్రామాల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్య సేవలందించాలని సూచించారు. డాక్టర్లు, ఇతర సిబ్బంది సెలవులు తీసుకోకుండా.. విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తూ.. మెడిసిన్స్ను బాధితులను అందజేయాలని చెప్పారు.
ఈ మేరకు హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావును కొత్తగూడెం కేంద్రంగా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేశ్ రెడ్డిని మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహిస్తూ హెల్త్ క్యాంపులు తదితర ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.