మధిర రూరల్, మార్చి 30: విద్యాబుద్ధు లు నేర్పించి విద్యార్థులకు బంగారు బాటలు వేయాల్సిన ఓ హెడ్మాస్టర్.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి కీచకపర్వానికి తెరలేపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి జడ్పీహెచ్ఎస్లో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మధిర మున్సిపాలిటీ మడుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్.. పాఠశాలలో 9, 10వ తరగతుల విద్యార్థినులపై కన్నేశాడు. కొన్ని రోజులుగా వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినుల బుగ్గలు నిమరడం, లో దుస్తుల కలర్ ఏంటని అడగడం, అందంగా తయారయ్యావంటూ కితాబులివ్వడం, ముద్దులు పెట్టాలంటూ కోరడం వంటి చేష్టలతో తన కీచకపర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ విషయాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియ క విద్యార్థినులు కొన్ని రోజులపాటు తమలో తామే కుమిలిపోయారు. ఆ తరువాత ఇతర టీచర్లకు చెప్పగా.. హెడ్మాస్టర్ చాలా మంచివాడంటూ వారు కితాబిచ్చారు. సదరు టీచ ర్లు ఈ విషయాన్ని మళ్లీ హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థినులపై కక్ష పెంచుకున్న హెచ్ఎం.. వారిపై వేధింపులను తీవ్రం చేశాడు. మరెవరికైనా చెబితే టీసీ ఇస్తానని, భవిష్యత్ లేకుండా చేస్తానని బెదిరించాడు. విద్యార్థినులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. ఆగ్రహించిన వారు స్కూల్కెళ్లి హెచ్ఎంను నిలదీశారు. తన తప్పేమీ లేదని తొలుత బుకాయించిన హెచ్ఎం.. ఆ తర్వాత తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు తల్లిదండ్రులు మధిర పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల ద్వారా బుజ్జగింపులు
ఓ పార్టీ నాయకుడి పలుకుబడితో సదరు హెచ్ఎం పోలీసులపై ఒత్తిడితెచ్చాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా.. హెచ్ఎంపై కేసు నమోదు చేయలేదు. ఏకంగా పోలీసులతోనే విద్యార్థినులను బుజ్జగించే ప్రయత్నం చేశాడు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని సూచించారు. కావాలంటే ఆర్థిక అవసరాల కోసం డబ్బులిస్తానని సదరు హెచ్ఎం చెప్తున్నాడని తెలిపారు. అందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారని, కేసు నమోదు చేయకతప్పదని పోలీసులు అన్నట్టు తెలిసింది.