DME | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఇప్పుడు ‘డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్’ (డీఎంఈ) పోస్టు అంటేనే అధికారులు ఉలిక్కి పడుతున్నారు. వైద్యవిద్యకు పెద్దదిక్కుగా నిలవాల్సిన పదవి తీవ్ర వివాదాస్పదంగా మారడమే ఇందుకు కారణం. కచ్చితమైన నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వ అసమర్థత కారణంగా అటు కోర్టులో ప్రతిసారి చుక్కెదురు కావడంతోపాటు ఇటు తరుచూ అధికారులను మార్చాల్సి వస్తున్నది.
తాజాగా ఇంఛార్జి డీఎంఈగా వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో మరో కొత్త డీఎంఈని నియమించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం గత మూడు నెలల్లో ఇద్దరు డీఎంఈలను మార్చింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై తీవ్ర ప్రభావం పడుతున్నదని వైద్యవర్గాలు వాపోతున్నాయి. సీనియార్టీ ప్రకారం మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిని డీఎంఈగా నియమించాలని గతంలో కోర్టు సూచించింది. అయితే ఆ పదవి కేవలం సీనియార్టీ ఆధారంగా ఇస్తే సరిపోదని, సమర్థతను కూడా చూడాలన్నది నిపుణుల అభిప్రాయం.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు గణనీయంగా పెరిగిపోవడంతో ఎన్ఎంసీ నిబంధనల మేరకు వాటి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. మరోవైపు ప్రభుత్వం కొత్త కాలేజీలను కూడా ప్రకటించింది. ఇలా కాలేజీలు, అనుబంధ దవాఖానల ఏర్పాటు, సిబ్బంది నియామకం, నిర్వహణ, ఎన్ఎంసీతో సమన్వయం.. ఇలా డీఎంఈ అనేక విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు చేసినా వేల మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయి. అందుకే సమర్థులైన అధికారులను నియమించాలని గత ప్రభుత్వం భావించింది. దీంతో రమేశ్రెడ్డిని ఇంచార్జ్జి డీఎంఈగా కొనసాగించింది.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దిశగా వేగంగా అడుగులు వేసింది. 2014లో రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. 2023-24 నాటికి 26కు పెరిగాయి. అంటే తొమ్మిదేండ్లలోనే 21 కాలేజీలకు అనుమతులు వచ్చాయి. మరో 9 కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తద్వారా జిల్లాకో మెడికల్ కాలేజీ దాదాపు పూర్తయింది. ఈ క్రమంలో డీఎంఈ పోస్టుపై న్యాయపరంగా అనేక సవాళ్లు ఎదురైనా ప్రభుత్వం సమర్థంగా సమాధానం ఇచ్చింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దృఢ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది. సీనియార్టీ ప్రకారం మొదట అర్హత ఉన్నవారికి పదవిని అప్పగించడమా లేక తమకు నచ్చిన వ్యక్తికి బాధ్యత అప్పగించి కోర్టుకు సమాధానం చెప్పుకోవడమా.. ఈ రెండు దారులు మాత్రమే ప్రభుత్వం ముందున్నాయి. కానీ ప్రభుత్వం దేనినీ ఎంచుకోవడంలేదు. ఎన్నికలు, ఆ తర్వాత ఇంచార్జి డీఎంఈ రమేశ్రెడ్డి రాజీనామాతో ఐదారు నెలలుగా వందల ఫైళ్లు పెండింగ్ పడ్డాయి. ప్రభుత్వం ముందుగా డాక్టర్ త్రివేణికి ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించింది. నెల రోజులు గడువకుండానే.. కోర్టుకు సమాధానం ఇచ్చుకోలేక ఆమెను తప్పించి, డాక్టర్ వాణికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు.
సరిగ్గా నెల రోజుల తర్వాత బుధవారం కోర్టు ఆమె నియామకాన్ని కొట్టివేసింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఓవైపు పెండింగ్ ఫైళ్లు పూర్తిగా క్లియర్ కాలేదు. మరోవైపు మెడికల్ కాలేజీలకు గుర్తింపు గండం ముంచుకొస్తున్నది. ఇప్పటికే ఎన్ఎంసీ తనిఖీలు మొదలయ్యాయి. ఇప్పటికే నడుస్తున్న కాలేజీల అనుమతులను కాపాడుకోవడంతోపాటు కొత్త కాలేజీలకు అనుమతులు సాధించాల్సి ఉన్నది. డీఎంఈ లేకుండా ఈ ప్రక్రియ నిర్వహించడం అసాధ్యం. ప్రభుత్వం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకొని డీఎంఈని నియమించకపోతే కాలేజీల గుర్తింపు రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఇంచార్జి అంటేనే అధికారులు జంకుతున్న నేపథ్యంలో రెగ్యులర్ డీఎంఈని నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.