కండ్లెదుట జరుగుతున్న అన్యాయాలను ఆయన చూస్తూ ఊరుకోలేదు. ప్రజలకు ధైర్య సాహసాలు నూరిపోసి స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్ధం చేశారు. హైదరాబాద్ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి పోరుబావుటాగా నిలిచారు.సత్యాగ్రహిగా, క్విట్ ఇండియా ఉద్యమ కార్యకర్తగా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, ఆదివాసీ, దళిత జనోద్ధరకుడిగా చరిత్రలో నిలిచిపోయారు జమలాపురం కేశవరావు. అందుకే ఆయనను అందరూ తెలంగాణ సర్దార్గా పిలుచుకుంటారు.
దక్కన్ సర్దార్, ఉక్కు మనిషిగా పిలుచుకునే జమలాపురం కేశవరావు 1908, సెప్టెంబర్ 3న జన్మించారు. వెంకటరామారావు, వెంకటనర్సమ్మలకు తొలి సంతానం కేశవరావు. వీరిది సంపన్న జమీందారీ వంశం. ఎర్రుపాలెంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. హైదరాబాద్లోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు కళాశాల విద్యార్థులను కూడగట్టి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గీతాన్ని ఆలపించనివ్వకపోతే తరగతులకు హాజరుకాబోమని హెచ్చరించారు. దీంతో చివరకు పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. కేశవరావు ఆరడుగుల ఆజానుబాహుడు. ఎత్తుకు తగ్గ దృఢమైన శరీరం, చెరగని చిరునవ్వుతో నిండుగా కనిపించేవారు.
మహాత్మా గాంధీ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు. భారత స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజమండ్రిలో ఆయన మొదటిసారిగా 1923లో మహాత్మా గాంధీ ఉపన్యాసాన్ని విన్నారు. 1930లో జరిగిన విజయవాడ సభలో గాంధీజీతో పరిచయమేర్పడింది. మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాలయ ఉద్యమాన్ని తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ముందుకు తీసుకెళ్లారు కేశవరావు. ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’ స్థాపనలో కేశవరావు కీలకపాత్ర వహించారు. దానికి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1938లో దీపావళి సందర్భంగా ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్లో కేశవరావు కీలక పాత్ర పోషించారు. 1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ముందుండి నడిపించారు. 1953, మార్చి 29న తన 46వ ఏట కన్నుమూశారు.