హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ మతోన్మాద, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ‘పెరుగుతున్న బీజేపీ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యం’ అంశంపై హైదరాబాద్లోని ఓంకార్భవన్లో సోమవారం నిర్వహించిన సదస్సులో పలువురు మాట్లాడారు. మతం పేరుతో ఉన్మాదాన్ని సృష్టిస్తూ మైనార్టీలపై బీజేపీ నాయకులు రకరకాల సాకులతో దాడులు తీవ్రతరం చేశారని విమర్శించారు.
బీహార్లోని ముజఫర్పూర్లో ఎంసీపీఐ(యూ) జాతీయ 5వ మహాసభలు ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయ్కుమార్, ఎస్యూసీఐ (సీ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురహరి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చలపతిరావు, సీపీఐ ఎంఎల్ రెడ్స్టార్ రాష్ట్ర కార్యదర్శి సైదయ్య తదితరులు పాల్గొన్నారు.