హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో ఎలాంటి జబ్బులు రానున్నాయో తెలుసుకొనేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కొత్త విధానాన్ని కనుగొన్నది. వ్యక్తుల నుంచి సేకరించిన రక్త నమూనాల ఆధారంగా కాకుండా రక్తంలోని స్టెమ్సెల్స్ ఆధారంగా వారికి భవిష్యత్తులో రాబోయే జబ్బులను ముందుగానే గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరిశోధనను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు హిమటో పేరుతో యూనివర్సిటీలో స్టార్టప్ను ఏర్పాటుచేశారు. వాణిజ్యపరంగా సేవలు విస్తరించేందుకు జెనెపవర్ఎక్స్ సంస్థతో బుధవారం ఒప్పందం చేసుకున్నది. హెచ్సీయూకు చెందిన డాక్టర్ సుభద్ర ఆధ్వర్యంలో ఈ స్టార్టప్ నడువనున్నది. జెనెపవర్ఎక్స్ నుంచి డాక్టర్ కల్యాణ్ ఉప్పలూరి, డాక్టర్ హిమ చల్లా ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కానున్నారు.