హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఏపీకి అఖిల భారత అధికారుల కేటాయింపుపై కొనసాగుతున్న వివాదానికి హైకోర్టు తెరదించింది. 10 మంది ఐఏఎస్లు, ముగ్గురు ఐపీఎస్ల కేటాయింపులకు సంబంధించి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్ ) ఇచ్చిన తీర్పును పకకు పెట్టింది. ఆ అధికారుల ప్రస్తుత సర్వీసు, మిగిలిన సర్వీసుతోపాటు వారి వ్యక్తిగత అభ్యంతరాలను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకుని కేటాయింపులపై పునఃసమీక్ష చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆలిండియా సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగానికి అప్పగించింది. ఆ అధికారుల వినతిపత్రాలపై కేంద్రం నిర్ణయం తీసుకునే వరకు వారందరినీ ప్రస్తుతం ఉన్న చోట్లే కొనసాగించాలని పేర్కొన్నది.
అయితే వారి వినతిపత్రాలపై కేంద్రం నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు ఎలాంటి గడువును విధించలేదు. ఆలిండియా అధికారుల కేటాయింపు నిమిత్తం ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని, తదనుగుణంగానే కేటాయింపులు చేయాలని స్పష్టం చేసింది. ‘క్యాట్’ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణను మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామారపు రాజేశ్వర్రావుతో కూడిన ధర్మాసనం బుధవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు జీ అనంతరాము, ఎం ప్రశాంతి, వాకాటి కరుణ, ఏ వాణీప్రసాద్, రోనాల్డ్ రోస్, ఎస్ఎస్ రావత్, తెలంగాణకు కేటాయించిన హరికిరణ్, జీ సృజన, శివశంకర్ లహోటితోపాటు ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారులు ప్రస్తుత తెలంగాణ రోడ్డు భద్రతా మండలి చైర్మన్, మాజీ డీజీపీ అంజనీ కుమార్, అభిలాష బిష్త్, అభిషేక్ మహంతి ‘క్యాట్’ను ఆశ్రయించారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసులను ‘క్యాట్’లో సవాల్ చేశారు. దీంతో ఆ కమిటీ మార్గదర్శకాలను కొట్టేస్తూ 2017లో ‘క్యాట్’ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసింది. దీంతో సోమేశ్ కుమార్ను ఏపీకి కేటాయిస్తూ కమిటీ చేసిన సిఫారసులను గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సమర్ధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును అంజనీ కుమార్తోపాటు ఇతర ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకూ వర్తింపజేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై తాజాగా ద్విసభ్య ధర్మాసనం తుది ఉత్తర్వులు వెలువరించింది.