Police Academy | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీస్ అకాడమీ రిటైర్డ్ అధికారులకు అడ్డాగా మారిందా? గెస్ట్ఫ్యాకల్టీల పేరుతో అక్కడే తిష్టవేసి అధికారం చెలాయిస్తున్నారా? స్పెషల్ శాలరీలు, ఇంక్రిమెంట్లు, ఇన్నోవా వాహనాలు, ప్రత్యేక రూములు, వసతి, ఇతర సేవలకు ఐదారుగురు హోంగార్డులతో హవా కొనగిస్తున్నారా? ఈ రిటైర్డ్ బ్యాచ్కు డీజీపీ స్థాయి అధికారితో పాటు ఓ మంత్రి అండదండలు దండిగా ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. తమ కండ్లముందే ఇంత జరుగుతున్నా, డైనమిక్ ఆఫీసర్గా పేరున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఏడీజీ అభిలాష బిస్త్ కూడా ఏమీ చేయలేక మిన్నకుండిపోతున్నారని తెలిసింది. ఓ అధికారి 14 ఏండ్ల పాటు తన సర్వీస్ను పొడిగించుకుంటూ అకాడమీ డైరెక్టర్ల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇన్నేండ్లు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఆయన చేసిన ఆగడాలు అన్నీఇన్నీ కావని పోలీస్ అకాడమీ కోడై కూస్తున్నది. ఆ రిటైర్డ్ అధికారి కింద పనిచేసే మరో ఉద్యోగి నెలకు 2-3 వేల లీటర్ల డీజిల్ మిగిలించి ఏకంగా ప్లాట్లు కొంటున్నారని విశ్వసనీయ సమాచారం.
పోలీస్ అకాడమీ ఇటీవల సదరు అధికారి సేవలకు స్వస్తి పలకటంతో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి, డీజీపీ ర్యాంకు కలిగిన ఓ అధికారి అండదండలతో మళ్లీ గెస్ట్ ఫ్యాకల్టీగా అకాడమీలోనే తిష్టవేసినట్టు సమాచారం. పోలీసు అకాడమీలో అడిషనల్ ఎస్పీ హోదాలో రిటైర్డ్ అయినా, 51 ఏండ్లుగా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. బయట ఆఫీసర్ల సెక్యూరిటీకి, అధికారుల ఇండ్లలో పనికి హోంగార్డులను పంపటం, వాహనాలు అందుబాటులో ఉంచటం, పై అధికారులకు వారం వారం బిర్యానీలు అకాడమీ మెస్ నుంచి బ యటికి పంపటం వంటి పనులు చేసి పైఅధికారులను బుట్టలో వేసుకోవటంలో ఆయన దిట్ట. కేవలం ఆయన కోసం నెలకు రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వేతనాలు, ప్రత్యేక వాహ నం, ఆయన దగ్గర పనిచేసేందుకు ఐదారుగు రు సిబ్బంది, డ్రైవర్లు, వారి వేతనం, ఇతర వసతులు కలిపి నెలకు సుమారు రూ.4-5 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఓ మహిళా అధికారిణిని సైతం పోలీసు అకాడమీలో గెస్ట్ ఫ్యాకల్టీగా కొనసాగిస్తున్నారని గుసగుస. ఆమె ఏకంగా గతంలో పనిచేసిన హోదాలోనే సంతకాలు గట్రా చేస్తున్నారని పలువురు చెప్తున్నారు. సదురు ‘మేడమ్’కు కూడా ప్రత్యేకంగా ఓ వాహనం, ఆఫీసు, డ్రైవరు, హోంగార్డులు ఇతర వసతులు అకాడమీ నుంచే కల్పిస్తున్నట్టు తెలిసింది. ఈ రిటైర్డ్ అధికారులకు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా నెలకు రూ.లక్షలు ఖర్చు అవుతున్నా అకాడమీ అధికారులు అయిష్టంగానే భరిస్తున్నారని సమాచారం. పోలీస్శాఖలో ఇప్పటికీ డీఏలు, సరెండర్లు, జీపీఎఫ్లు, పీఆర్సీలకు దిక్కులేకపోవటం, రిటైర్డ్ అయినవారికి మాత్రం ప్రతి నెల లక్షల్లో ఖర్చు చేస్తుండటం, వారిని నిజాయితీపరులైన అధికారుల నెత్తిన కూర్చోబెడుతుండటంతో కొందరు అధికారులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
ఓ రిటైర్డ్ అధికారి పోలీస్ అకాడమీలో ఉన్న సమయంలో ఎన్నో అవకతవకలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. మోటర్ ట్రాన్స్పోర్ట్ (ఎంటీ) సెక్షన్కు ఇంచార్జిగా ఉన్న సమయంలో ఆయన పరిధిలో వందమంది డ్రైవర్లు, కార్లు, బస్సులు, టూ వీలర్స్, ఇతర వాహనాలు 200 వరకు ఉండేవి. అయితే ఆ వాహనాలను నెల మొత్తం ఉపయోగించకపోవటం వల్ల ఆ కోటాలో మిగిలిన మిగిలిన డీజిల్ను వాడినట్టు నెల చివర్లో లెక్కల్లో చూపించారని ఆరోపణలు ఉన్నాయి. అలా మిగిలిన డీజిల్ సుమారు ఇలా 3 నుంచి 4 వేల లీటర్లు ఉంటుందని సమాచారం. ఆ డీజిల్ను పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (పీటీవో) బంక్లోని తెలిసిన సిబ్బందితో అమ్మించి డబ్బులు దండుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆయన హయాంలో డీజిల్ సొమ్ముతో ఓ అధికారి ఏకంగా ప్లాట్లు కూడా కొన్నట్టు తెలిసింది. డీజీపీ ఏదైనా కార్యక్రమాలకు వచ్చేటప్పుడు జరిగే ఫంక్షన్లు, ఆగస్టు 15, జనవరి 26, జూన్ 2 వంటి ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు నిర్వహించే ఫంక్షన్లకు సైతం రూ.15 వేలు అయ్యే ఖర్చును రూ.50 వేలుగా చూపించేవారని సమాచారం. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్లీ గెస్ట్ ఫ్యాకల్టీగా పోలీస్ అకాడమీలో కొనసాగించటం ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది.