CM Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ అయ్యారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7 నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ (పీఎస్ఐఎల్-24) కార్యక్రమంపై గురించి సీఎంకు వివరించారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సీఎం కోరారు.
7వ తేదీ నుంచి 12 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సహకారంతో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు, 33 జిల్లాల నుంచి ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు ఐదురోజుల పాటు సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ (పీఎస్ఐఎల్-24) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కార్యక్రమం గురించి వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ డీ రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాశ్, డాక్టర్ ఎండీ రైట్ పాల్గొన్నారు.