పెద్దపల్లి జంక్షన్/ముకరంపుర/కాజీపేట, ఆగస్టు 19: కాజీపేట-పెద్దపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడోలైన్ పనులు త్వరలోనే పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి వద్ద మానేరు నదిపై వంతెన నిర్మాణం పూర్తయితే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రెండు ఫిట్లైన్ల పనులు పూర్తయితే కాజీపేట రైల్వే జంక్షన్కు మహర్దశ వస్తుందని తెలిపారు. కాజీపేటలోని రైల్వే పాలిక్లినిక్ను సబ్-డివిజన్ దవాఖానగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గురువారం ఆయన హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. కాజీపేటలోని డీజిల్ షెడ్డు సమీపంలో రూ.20 కోట్లతో జరుగుతున్న 26 కోచ్ల రెండు ఫిట్లైన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈఎల్ఎస్ రైల్వే క్వార్టర్స్లో సీవరేజీ ట్రీట్మెంట్ వాటర్ప్లాంట్, పెద్దపల్లి రైల్వే జంక్షన్లో హమాలీ రెస్ట్రూంను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి రైల్వే జీఎంను కలిసి పెద్దపల్లిలో పలు సూపర్ఫాస్ట్ రైళ్లను నిలుపాలని విజ్ఞప్తిచేశారు. ఇందుకు జీఎం సానుకూలంగా స్పందించారు. అక్కడి నుంచి కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లెలోని రైల్వేస్టేషన్ను సందర్శించారు. కాజీపేటలో నూతన కార్యాలయాల ఎదుట, పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే అధికారుల పనితీరు బాగుందని ప్రశంసించారు.