హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య మరింత పెరగాలని, అప్పుడే కేసీఆర్ కిట్, ఇతర ప్రోత్సాహకాలు అందుతాయని మంత్రి హరీశ్రావు అన్నారు. వైద్యులు, సిబ్బంది సమిష్టి కృషి వల్ల ఏడాదిలో 6 శాతం సిజేరియన్లు తగ్గాయని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు, ఆశా, ఏఎన్ఎంల పనితీరుపై హరీశ్రావు శనివారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. 2025 నాటికి టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, టీబీ బాధితులను ఆదుకొనేందుకు దాతలను ఆహ్వానించాలన్నారు. నిక్షయ్ మిత్రగా నమోదు చేయించేందుకు జిల్లా వైద్యాధికారులు చొరవ చూపాలని సూచించారు. మొత్తం 720 పీహెచ్సీల్లో ఇంటర్నెట్ సదుపాయంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
2025 నాటికి లక్ష్యం చేరుకోవాలి
మీజిల్స్, రుబెల్లా (తట్టు, అమ్మవారు) అంటువ్యాధులను 2025 నాటికి రూపుమాపే లక్ష్యంతో చికిత్స అందించాలని హరీశ్రావు పేర్కొన్నారు. చలి విజృంభిస్తుండటంతో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నదని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమీక్షలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతామహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలక్షి, మెడికల్ ఆఫీసర్లు, డీఎంహెచ్వోలు, అదనపు డీఎంహెచ్వోలు పాల్గొన్నారు.
39 వేల మందికి న్యూట్రిషన్ కిట్లు
రాష్ట్రవ్యాప్తంగా 39 వేల మందికి న్యూట్రిషన్ కిట్లు అందిస్తామని, సిద్దిపేట జిల్లాలో వెయ్యి ఇవ్వనున్నట్టు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేటలో టీబీ వ్యాధిగ్రస్థులకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.