హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని… రాహుల్ సంఘర్షణ సభ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత సభ దేని గురించి అని రాహుల్ అడిగారని, దీన్ని బట్టి రైతుల పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
తెలంగాణలోని సబ్బండవర్ణాల సంక్షేమం గురించి సీఎం కేసీఆర్ మాత్రమే ఆలోచిస్తారంటూ శనివారం వరుస ట్వీట్లు చేశారు. ‘రాహుల్ గాంధీ.. వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ను.. చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.