హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నిరుద్యోగ యువతి, యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ జాడ పత్తా లేదని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ పోస్టులు పెంచాలని కోరారు, ఇప్పుడు గ్రూప్ విద్యార్థులు పోస్టులు పెంచాలని కోరితే స్పందించడం లేదన్నారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశమివ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1:100 విధానం అమలు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఉపముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యుతను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం ఇచ్చారని చెప్పారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వచ్చి ఆరు నెలలయిందని, ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు. పింఛన్ ఎప్పుడిస్తరని అవ్వతాతలు అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పెన్షన్ వచ్చేందని అంటున్నారని తెలిపారు. రెండు నెలల నుంచి ఆసరా పింఛన్ రావడం లేదని వెల్లడించారు. అవ్వతాతలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న పింఛన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాపాలన పేరుతో తీసుకున్న ఆరు గ్యారంటీల దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజాపాలన ఆచరణలో ఏమైందన్నారు. పేదల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. ఏపీ సీఎం మొదటి సంతకంతో పింఛన్ రూ.4 వేలకు పెంచారని, మీరు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వికలాంగులకు రూ.6 వేల పింఛన్ వెంటనే ఇవ్వాలన్నారు. చేనేత, గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ పేషెంట్లకు బీఆర్ఎస్ హాయంలో పెద్ద ఎత్తున పింఛన్ ఇచ్చామని చెప్పారు. ఇంటికి రెండు పింఛన్లు ఇస్తామన్నారని గుర్తుచేశారు.
ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు ఇస్తే ఆశా వర్కర్లు ఎందుకు వైద్యవిధాన పరిషత్కు వస్తారని ప్రశ్నించారు. ఎన్హెచ్ఎం కింద 17 వేల మంది పనిచేస్తున్నారని, వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల నుంచి సఫాయి కార్మికులకు ఎందుకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. వెంటనే గ్రామపంచాయతీయలకు నిధులు విడుదల చేయాలన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులపై కేసీఆర్ బొమ్మ ఉందని ఇవ్వట్లేదని, 1.5 లక్షల మంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు రోడ్లు ఎక్కుతున్నారని, 60 వేల మంది జీతాల కోసం వేచిచూస్తున్నారన్నారు. తమ హయాంలో వారికి జీతాలు ఆపలేదన్నారు.