హైదరాబాద్: గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలవుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరవాలని, తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలన్నారు.
‘గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు.. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి ఈ కోర్టు తీర్పుకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? . హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ నీ నిరాక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు.
గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కండ్లు తెరువు. నీ నిర్లక్ష్య, మోసపూరిత వైఖరికి సిగ్గుతో తలదించుకో. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పు.’