Harish Rao | స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందంటూ మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే.. తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరుతో కాంగ్రెస్ సర్కారు హడావుడి చేస్తుండడం దౌర్భాగ్యమన్నారు. ఫిబ్రవరి ఒకటిన గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసిందని.. దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకు ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటంతో నిర్వహిస్తుందన్నారు. చేయని పనులకు డబ్బా కొట్టుకోవడం బదులు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని హరీశ్రావు హితవు పలికారు.
తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేర్చే లక్ష్యంలో భాగంగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు జిల్లాకో మెడికల్ కాలేజీ బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 5,204 స్టాఫ్ నర్స్పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా.. 2023 జూన్ 22న 1,890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగిందని తెలిపారు. 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి, తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ మొదలైందన్నారు. దాంతో తుది ఫలితాల విడుదలకు తాత్కాలిక ఆటంకం కలిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహిస్తూ, నియామక పత్రాలు ఇచ్చే పేరిట హడావుడి చేస్తూ స్టాఫ్ నర్సు నోటిఫికేషన్ తమ ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది 2లక్షల పోస్టులను భర్తీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించి, అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, ఏడాదిలోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు విడుదల చేసిందని గుర్తు చేశారు. చెప్పినట్లుగా ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్, అలాగే ఏప్రిల్ 1న గ్రూప్-2, జూన్ 1న గ్రూప్-3,4 నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 1న పోలీసు సహా తరహా యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఎదురుచూస్తున్న ఉద్యోగ అభ్యర్థులకు, విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.
స్టాఫ్ నర్సులుగా ఎంపికై బుధవారం నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మన్ననలు పొందేలా అత్యుత్తమ సేవలందించి, ఉద్యోగంలో రాణించాలని ఆకాంక్షించారు. మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB)ని అభినందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నర్సుల సేవలను గుర్తించి, వారి గౌరవాన్ని మరింత పెంచేలా వృత్తి పేరును ఉన్నతీకరించిందని హరీశ్రావు అన్నారు. స్టాఫ్ నర్స్ని నర్సింగ్ ఆఫీసర్గా, హెడ్ నర్స్ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా, హెడ్ నర్స్ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్గా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. నర్సు పోస్టుల పేరును మా ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసి ఉన్నతీకరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్టాఫ్ నర్సులుగా పరిగణించడం శోచనీయమని హరీశ్రావు అన్నారు.