సంగారెడ్డి : మెదక్ పార్లమెంట్ స్థానం( Medak Parliamentary seat) బీఆర్ఎస్ (BRS)పార్టీ అడ్డా. మెదక్లో వెంకట్రామి రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు. 2004 నుంచి మెదక్లో బీఅర్ఎస్ పార్టీ గెలుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. బుధవారం పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ది గణపతి దేవాలయం (గణేష్ గడ్డ) ఆవరణలో బీఆర్ఎస్ మెదక్ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఅర్ఎస్ గెలుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ మెదక్ పార్లమెంట్లో తిరుగులేని మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఓట్ల కోసం ప్రజలను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. రూ.4 వేల పింఛన్లు, రైతుబంధు, మహిళలకు రూ.2,500 ఇలా ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు గారడి మాటలు చెప్పారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తిట్ల పురాణం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది..రేవంత్ రెడ్డి తిట్ల కోసమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ వార్తలు, లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులను పట్టించుకోలేదని చెప్పారు. వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) పక్కా లోకల్.. తెల్లాపూర్లోనే నివాసం ఉంటారని పేర్కొన్నారు.
వెంకట్రామిరెడ్డి అధికారిగా మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. మంచి మనిషి, పరిపాలన అనుభవం ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. దుబ్బాక ప్రజలు బీజేపీ అభ్యర్ధి రఘునందన్రావును చిత్తు చిత్తుగా ఓడించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు.
భవిషత్తు అంతా బీఅర్ఎస్ పార్టీ దేనని స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది
బీఆర్ఎస్ పార్టీయేనని, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసే వెంకట్రామి రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, తదితరులు ఉన్నారు.