హైదరాబాద్ : తెలంగాణ(Telangana )కు ప్రాణప్రదమైనవి నీళ్లు.. రాజకీయాలు మాట్లాడాల్సిన టైమ్లో మాట్లాడుతాం. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కలిసి మాట్లాడారు.
ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నారు. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు(Cultivated water projects) కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీ(KRMB) పరిధిలోకి వారం రోజుల్లోగా వెళ్తాయని నిన్న ఢిల్లీ లో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్లో నిర్ణయమైనట్టుగా తెలుస్తున్నది. ఇదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జూలై 2021 లోనే కేంద్రం కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనను కేసీఆర్ నాడు గట్టిగా వ్యతిరేకించారు. మేము ఆనాడు కొన్ని షరతులు పెట్టాం. వాటిని ఇంకా కేంద్రం ఒప్పుకోలేదని గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో ఇంకా తెలంగాణ వాటా తేలనప్పుడు కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ప్రశ్నించారు.
కృష్ణా నీటిని ఏపీకి 50 శాతం తెలంగాణకు 50 శాతం పంపిణీ చేయాలని కూడా షరతు పెట్టాం. శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేయాలని మరో షరతు పెట్టాం. ఏక పక్షంగా కేఆర్ఎంబీపై నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని మేము ఆనాడే కోరామన్నారు. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని సూటిగా ప్రశ్నించారు.
ప్రస్తుత ప్రభుత్వం గుడ్డిగా కేఆర్ఎంబీ ఏర్పాటుకు ఒప్పుకున్నదని వార్తలు వస్తున్నాయని చెప్పారు. పాలమూరు -రంగారెడ్డి కి జాతీయ హోదా కేంద్రం ఇవ్వమంటే ఒప్పుకున్నట్టే..కేఆర్ఎంబీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అనిపిస్తుందన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తెస్తే జల విద్యుత్ ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ ఆయకట్టు పై కూడా కేఆర్ఎంబీ ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్కు తాగు నీళ్లకు కూడా కటకట ఏర్పడుతుందని చెప్పారు. కేఆర్ఎంబీలో ఉమ్మడి ప్రాజెక్టులు చేరిస్తే తెలంగాణకు ఆత్మహత్యా సదృశ్యమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం స్పందించకుంటే బీఆర్ఎస్ పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. మేడి గడ్డ బ్యారేజ్కి నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని తెలిపారు.
కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా వెంటనే నీటిని విడుదల చేయా లన్నారు. కాళేశ్వరం పంపులను సాంకేతికంగా 24 గంటలు నడపాలి. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మోటార్లు నడప కూడదన్నారు. మా మీద బురద జల్లడం కాదు..కాళేశ్వరం పై రోజుకో లీకు ఫేక్ వార్తను ప్రభుత్వం సృష్టిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, వాటి కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.