Minister Harish Rao | రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరోసారి ఉదారతను చాటుకున్నారు. తల్లిలేని నవజాత శిశువు ఆకలిని తీర్చేందుకు ఏకంగా ఆవును కొనుగోలు చేసి ఇచ్చారు. మంత్రిపై పలువురు
ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుమూల ప్రాంతమైన రాజుగూడకు చెందిన కొడప పారుబాయి జనవరి 10న ఇంద్రవెల్లి పీహెచ్సీలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పది రోజులకే ఆ తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది.
అప్పటి నుంచి పాప ఆకలి తీర్చేందుకు తండ్రి జంగుబాబు, తాత బాపురావు పడరాని పాట్లు పాడుతున్నారు. బిడ్డ ఆకలి తీర్చేందుకు పాల ప్యాకెట్ కోసం రోజూ పది కిలోమీటర్లు ప్రయాణించి.. ప్యాకెట్ కొని తీసుకువస్తున్నారు. గూడెంలో ఎవరికి ఆవు గానీ, మేక గానీ లేకపోవడం సమస్యగా మారింది. ఈ సమస్యను మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి హరీశ్రావు తక్షణం ఆ బిడ్డకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బిడ్డకు పాల కొరత లేకుండా ఉండేలా ఆవును సమకూర్చాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు, సమీప పీహెచ్సీ సిబ్బంది ఆ పసికందు వద్దకు వెళ్లి పాల ప్యాకెట్లు, అవసరమైన పౌష్ఠికాహారం ప్యాకెట్లు అందించారు.
ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. తండ్రి కోరిక మేరకు శాశ్వత పరిష్కారంగా, పాలిచ్చే ఆవును కొనుగోలు చేసి అందజేశారు. బిడ్డకు ఇక పాలు లేవనే సమస్య ఉండబోదని, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తమకు చెప్పాలని వైద్య సిబ్బంది బిడ్డ తండ్రి, తాతకు భరోసా ఇచ్చారు. పత్రికలో వచ్చిన వార్తకు స్పందించి పసికందుకు పాలు అందించేందుకు ఆవును సమకూర్చడంపై మంత్రి హరీశ్ రావుకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. బిడ్డను బాగా చూసుకుంటామని, మంత్రి అందించిన ఆవును గొప్ప బహుమతిగా భావిస్తామని తెలిపారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి హరీశ్ రావుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.