Harish Rao | హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు. పదేండ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమను కంటికిరెప్పలా కాపాడారని, ఇప్పుడు వాళ్లను కాంగ్రెస్ నేతలు సొంత రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలనకు పరాకాష్ట అని ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మారకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తున్నది
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తున్నదని హరీశ్రావు పేర్కొన్నారు. ‘సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదంటారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఇటీవల చెప్పుకొన్న కోమటిరెడ్డి ఇప్పుడున్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు? టికెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటిరెడ్డి చెప్పకనే చెప్తున్నారు అంటే, తెలంగాణలో సినిమాశాఖకు మంత్రి ఉన్నట్టా.. లేనట్టా? సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉన్నది. సీఎం స్పష్టంచేయాలి’ అని డిమాండ్ చేశారు.
పాలకుడు పాలసీతో ఉండాలి పగతో కాదు
ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు సీఎం నీతులు చెప్పారని, ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు సినిమారంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? అని హరీశ్రావు ప్రశ్నించారు. పాలకుడు ఉండాల్సింది పాలసీతో పగతో కాదని హితవు పలికారు.
రేట్ల కమీషన్ల దందాపై విచారణ జరుపాలి
పదేండ్ల కేసీఆర్ పాలనలో సినీ పరిశ్రమను కంటికిరెప్పలా కాపాడుకున్నామని, ఎకడా వివక్ష చూపలేదని హరీశ్రావు గుర్తుచేశారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆసార్ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ అహంకారంతో, పగ ప్రతీకారాలతో, చిల్లర రాజకీయాలతో పరిశ్రమ వాతావరణాన్ని నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒకో సినిమాకు కమీషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో? ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతామని చెప్పారు. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న టికెట్ రేట్ల కమీషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం సీఎం రేవంత్కు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు. నేను ఈ సీట్లో ఉన్నంత కాలం టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం? అని ఊదరగొట్టిండు. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు. ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వం మారదా? టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా?
-హరీశ్రావు
రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తున్నది. ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తది. కానీ సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం తెలియదంటడు. ఆ శాఖ చూసే మంత్రి ప్రమేయం లేకుండానే.. జీవో ఇచ్చేది ఇంకొకరు. క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే ఇంత పెద్ద నిర్ణయం జరుగుతున్నదంటే.. అసలు ప్రభుత్వాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నరు. రేట్ల పెంపు సీఎం నిర్ణయమేనని కోమటిరెడ్డి చెప్పకనే చెప్తున్నారు. సీఎం రేవంత్రెడ్డీ.. అసలు మీరు నడుపుతున్నది సర్కారా? సర్కస్ కంపెనీయా?
– హరీశ్రావు
ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక నటుడు సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో నటుడిని జైలుకు పంపుతరు. మీకు నచ్చినోళ్లు అయితే.. రూ.600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తరా?.. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తరా. పాలకుడు అనేవాడు పాలసీతో ఉండాలి తప్ప, పగతో కాదు’
– హరీశ్రావు