Harish Rao | మాదేమో శ్రమ ఫలితం.. మీదేమో శిలా ఫలకమా.., ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం మాది.. ప్రారంభోత్సవానికి కత్తెర మీదా అంటూ కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడానికంటే ముందు జిల్లాకు రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1070 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని.. మూడు సార్లు రైతు భరోసా ఎగ్గొ్ట్టారని.. వాటన్నింటినీ రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా వస్తున్నారని హరీశ్రావు అన్నారు. ఇన్నాళ్లు మా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని.. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గం లేదన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు.. ఇప్పటికీ నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం పేరిట ఇక్కడ అడుగుపెడుతున్నారని.. ఈ సందర్భంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున నిన్ను కొన్ని ప్రశ్నలు అడగదలచుకునన్నానని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలమే ఈ ఫామాయిల్ ఫ్యాక్టరీ. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా మాట్లాడిన నీ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభించడం శోచనీయమని హరీశ్రావు అన్నారు. కోనసీమ, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కనిపించే ఫామాయిల్ మొక్కలను ఏ నదీ ప్రవాహం లేని సిద్దిపేట జిల్లాలో ఎలా సాగు చేశారో ఇప్పటికైనా మీకు అర్థమైందా..? అని ప్రశ్నించారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెరుగుతాయి. మంచి దిగుబడి ఇస్తాయి. కరువు పీడిత సిద్దిపేట జిల్లాలో తేమ శాతం ఎక్కడి నుండి వచ్చిందో నీ వెంట ఉండే ఇంజనీర్లను అడుగు ముఖ్యమంత్రి గారు అని ఎద్దేవా చేశారు.
2018 లో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ(IIOPR) Indian Institute of Oilpalm Research శాస్త్రవేత్తల బృందం సిద్దిపేట జిల్లాలో తిరిగి నీటి వసతి, గాలిలో తేమ లేదని సిద్దిపేట జిల్లా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం కాదన్నారు. కానీ 2021 లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైన అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా నీటి వసతి, గాలిలో తేమశాతం పెరగడం వలన సిద్దిపేట జిల్లా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని IIOPR శాస్త్రవేత్తల బృందం ప్రకటించిందని గుర్తుచేశారు. ఫామాయిల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వమే రూ.300 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. నర్మెట్ట గ్రామ రైతుల సహకారంతో టీజీఐఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సేకరించామని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ 4 వ తేదీన ఫ్యాక్టరీకి భూమిపూజ చేసి వెంటనే సివిల్ పనులకు టెండర్లు పిలవడం జరిగింది. పామ్ ఆయిల్ నూనె గింజల దిగుబడి వచ్చేలోగా ఫ్యాక్టరీ అందుబాటులోకి రావాలని మొదటి దశ పనులను శరవేగంగా ప్రారంభించామని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (zld) వ్యవస్థతో మలేషియా టెక్నాలజీ తో ఈ ఆయిల్ పంప్ ఫ్యాక్టరీని నిర్మించాలని ఆనాడే నిర్ణయం తీసుకోవడం జరిగిందని హరీశ్రావు తెలిపారు. ముందుగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని ప్రారంభించాక ఆ వెంటనే రిఫైనరీ ఆయిల్ ఉత్పత్తి జరిగేలా ప్లాంటును కూడా ప్రారంభించాలని ఆనాడే నిర్ణయించామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీకి నీటి కొరత లేకుండా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి ఎల్ డి 9 కాలువ ద్వారా 20 కోట్ల లీటర్ల నీటిని నిలువ చేసేలా స్టోరేజీ వాటర్ రిజర్వాయర్ కూడా సిద్ధం చేయడానికి 2023 జూలై నెలలో ఫౌండేషన్ వేశామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విడుదలైన నిధులతో ఆనాడే ప్రారంభమైన పనుల కారణంగా ఇప్పుడు పూర్తయిన ఫ్యాక్టరీని మీరు ప్రారంభిస్తున్నారనే విషయాన్ని గమనించాలని సూచించారు.
ఫామాయిల్ రైతుల కళ్లలో సంతోషాన్ని చూస్తున్నామని తెలిపారు.. ఫామాయిల్ సాగుపై రైతుల్లో చైతన్యం కల్పించడం, వారిని బస్సుల్లో తీసుకెళ్లి అశ్వరావుపేట, అప్పారావుపేట లో ఫామాయిల్ పంటలను, ఫ్యాక్టరీలను సందర్శింపజేసి రైతుల్లో చైతన్యం తెచ్చామని నాటి పరిస్థితులను గుర్తుచేశారు. మొక్కలు నిరంతరంఈ అందుబాటులో ఉండేలా నర్సరీలు ఏర్పాటు చేయడం, ప్రత్యేక సబ్సిడీలతో రైతులను ప్రోత్సహించామని తెలిపారు. చివరకు దిగుబడి ప్రారంభమయ్యాక నూనెగింజల కొనుగోళ్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడే అత్యాధునిక ఫామాయిల్ ఫ్యాక్టరీని నెలకొల్పడం అన్నీ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము చేసిన కృషి ఫలితమే అని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు, ఫామాయిల్ తోటల సాగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమేనని గుర్తుచేశారు. మీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ను అడగండి.. అనాడు నేను, మా రైతులు పడిన కష్టం గురించి చెబుతారని అన్నారు.
2021 జూన్ 5వ తేదీన తొలి పామాయిల్ మొక్కను నేను నాటిన విషయం ఈ జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని హరీశ్రావు తెలిపారు. ఎందుకంటే అసలే కొత్త పంట.. దిగుబడి వస్తుందో రాదో తెలియని పరిస్థితి.. రైతుల ఆదాయం పెంచాలనే నా ఆలోచన కేసీఆర్ ఆశీస్సులతో ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొన్నారు. నా ఒక్కడి మాటపై నమ్మకంతో నేడు 15 వేల ఎకరాలకు పైగా పామాయిల్ సాగు చేయడం.. పంటలు కోతకు వచ్చి మంచి దిగుబడి రావడం నాకు జీవితాంతం తృప్తిని మిగులుస్తుందన్నారు. ఏది ఏమైనా.. పామాయిల్ రైతులకు ఆర్థిక భద్రతను, మనో ధైర్యాన్ని కల్పించడానికి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నందున.. ఇందులో నా పాత్ర కీలకంగా ఉన్నందుకు గర్వపడుతున్నాన్నానని అన్నారు.
– 2022 జనవరి 12వ తేదీన 62 ఎకరాల భూమి కేటాయించి, మార్చి 4న భూమికి ఫెన్సింగ్ వర్క్ పనులు మరియు స్టోరేజ్ వాటర్ రిజర్వాయర్ ను ప్రారంభించామని హరీశ్రావు తెలిపారు 2023 ఏప్రిల్ 4న ఫ్యాక్టరీ కి పునాదిరాయి వేసి త్వరితగతిన పనులు ప్రారంభించామని చెప్పారు. మాదేమో శ్రమ ఫలితం.. మీదేమో శిలా ఫలకమా అని ప్రశ్నించారు. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వానిది కొండంత పాత్ర అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వానిది గోరంత ప్రమేయం మాత్రమేనని చెప్పారు.
నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా.. అధికారంలోకి వచ్చినా మా సిద్దిపేట నియోజకవర్గంపై మీ కక్ష చల్లారదని అర్థమైందని హరీశ్రావు అన్నారు. నువ్వు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన రూ. 1070 కోట్ల నిధులను అర్ధాంతరంగా రద్దు చేశావని మండిపడ్డారు. నిధులు రద్దు చేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిన విషయాన్ని మా నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రేపు అధికారికంగా వస్తున్నందున ఈ నిధులన్నీ తిరిగి తెస్తావనని ఆశిస్తున్నామని అన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదు.. మా రైతులకు సంబంధించిన దాదాపు రూ.300 కోట్ల రూపాయల రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులకు నువ్వు మూడుసార్లు ఎగ్గొట్టిన దాదాపు రూ.170 కోట్ల రైతు భరోసా డబ్బులు రేపు ఇచ్చి వెళ్తావని ఆశపడుతున్నారని అన్నారు. గత మూడు సీజన్లుగా వడగళ్ల వర్షాలతో నష్టపోయిన రైతులకు రావాల్సిన పరిహారం మంజూరు చేయాలని కోరారు. నీకు సిద్దిపేట పై కక్షాపూరిత ఆలోచన లేకుంటే.. సిద్దిపేట ప్రజలపై ఈర్ష ద్వేషాలు ఉండకుంటే.. నీవు రద్దు చేసిన నిధులన్నీ వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదు.. ఖాళీ చేతులతోనే వస్తున్న.. కత్తెరతో రిబ్బన్ కట్ చేసి వెళ్తా. అని అనుకుంటే మా ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.
– ప్రభుత్వ వెటర్నరీ కళాశాల
– రంగనాయకసాగర్ టూరిజం
– కోమటిచెరువు శిల్పారామం
– సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగు రోడ్డు
– తోర్నాలలో బిఎస్సీ అగ్రికల్చర్ కళాశాల
– మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం
– సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పొర్ట్స్ హబ్
– టు టౌన్ పోలీస్స్టేషన్ భవనం
– త్రీ టౌన్ పోలీస్స్టేషన్ భవనం
– సిద్దిపేట– ఇల్లంతకుంట ఫోర్లేన్ రోడ్డు
– సిద్దిపేట– కిష్టాపూర్ రహదారి
– సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం
– సిద్దిపేట బ్లాక్ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్