సిద్దిపేట, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి ప్రాంగణం కల్యాణ వేదిక వద్ద ఈ వేడుకను నిర్వహించారు. కల్యాణానికి ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయానికి సంబంధించిన 1,570 గ్రాముల బంగారంతో తయారుచేసిన రూ.కోటి విలువైన బంగారు కిరీటం స్వామి వారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు సమర్పించారు.
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా బార్శీ మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల స్వామీజీ కల్యాణతంతును పర్యవేక్షించారు. ఉదయం 10.45 గంటలకు కల్యాణం వైభవంగా జరిగింది. స్వామి వారి తరఫున పడిగన్నగారి వంశస్థులు, అమ్మవార్ల తరఫున మహదేవుని వంశస్థులు పాల్గొని వేడుకను నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు రుద్రాభిషేకం, సాయంత్రం శకటోత్సవం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణ మహోత్సవానికి టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కట్నాలు సమర్పించిన మంత్రులు
కల్యాణోత్సవానికి హాజరైన మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి రూ.1,00,116 చొప్పున కట్నాలు సమర్పించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి రూ.50,116, టీఎస్ఎంఎస్ఐడీస్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ రూ.25,116, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి రూ.25,116 ప్రకటించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్యాదవ్ రూ.50,116 కట్నం అందజేశారు.
క్యూలైన్ల నిర్మాణానికి 11 కోట్లు: హరీశ్
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి పెద్దమొత్తం నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. మల్లన్న కల్యాణోత్సవానికి హాజరైన సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. కొమురవెల్లిలో క్యూలైన్ల నిర్మాణం కోసం రూ.11 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో 50 గదుల కాటేజీలు అందుబాటులోకి రానున్నట్టు పేర్కొన్నారు. గర్భగుడి నుంచి కోనేరు నేరుగా కనిపించే విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించినప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా కలశాల ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి మల్లన్న స్వామి పాదాలను కడిగిన విషయాన్ని గుర్తుచేశారు. గత కల్యాణం సమయంలో చెప్పిన విధంగా మల్లన్న స్వామికి స్వర్ణకిరీటం చేయించి సమర్పించినట్టు తెలిపారు. వచ్చే మల్లన్న కల్యాణోత్సవానికి మేడలమ్మ, కేతమ్మలకు కిలో బంగారంతో స్వర్ణ కిరీటాలు చేయిస్తామని హరీశ్రావు పేర్కొన్నారు.