ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉందని, మొదటిస్థానంలో నిలిపేందుకు అందరం కృషిచేద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. వైద్యారోగ్యంపై ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్యారోగ్య రంగాలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అరోగ్య రంగానికి బడ్జెట్లో రూ. 11,440 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తుందని వెల్లడించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యారోగ్య సేవలు విస్తృతమయ్యాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. క్షేత్ర స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ప్రజలకు మరింత మెరుగ్గా ఈ సేవలు అందించేందుకు నిత్యం మానిటరింగ్ చేయాలన్నారు. 99 శాతం బాగా పని చేసినా.. ఒక్క నిర్లక్ష్యం చెడ్డ పేరు తెస్తుందని, ఆ ఒక్క తప్పుకూడా జరగకుండా చూసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ దవాఖానల్ఓ డయాగ్నొస్టిక్స్ పేరిట అద్భుతమైన రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నామని చెప్పారు. 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని, దీనిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
అరోగ్య శ్రీ సేవలు మెరుగుపడాలి..
రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు ఆరోగ్య శ్రీసేవలు మెరుగ్గా అందేలా చూడాలని అధికారులకు మంత్రి హరీశ్రావు సూచించారు. ఆరోగ్య శ్రీ మెరుగుపడితేనే పేదలకు ఉచిత వైద్యం అందడంతోపాటు దవాఖానలు బలోపేతమవుతాయన్నారు. 108, 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలు, ఆలనా వాహనాలపై సమీక్షించాలన్నారు. దవాఖానల్లో జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. పీహెచ్సీల్లో వైద్యుల కొరత అనే మాట ఉండొద్దని, సీఎం కేసీఆర్ ఎక్కడా ఖాళీ లేకుండా భర్తీ చేయాలని చెప్పారన్నారు. ప్రతి పీహెచ్సీలో కచ్చితంగా ఒక డాక్టర్ ఉండాలన్నారు. ఖాళీలుంటే వాక్ ఇంటర్వ్యూలు పెట్టి వెంటనే భర్తీచేయాలని ఆదేశించారు.
102 వాహనాలను సమర్థవంతంగా వాడాలని, గర్భిణులకు అత్యుత్తమ సేవలందాలని మంత్రి హరీశ్రావు సూచించారు. ఏఎన్ఎంలతో క్రమంతప్పకుండా గర్భిణులకు చెకప్స్ చేయించాలని ఆదేశించారు. ముఖ్యంగా సిజేరియన్లు తగ్గించడంపై సర్కారు దృష్టిపెట్టిందన్నారు. కలెక్టర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్షన్లపై ఆడిట్ చేయాలన్నారు. తల్లీబిడ్డకు నష్టం అనుకున్నప్పుడు మాత్రమే సీ సెక్షన్లు చేయాలన్నారు. ఈ విషయంలో సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కేసీఆర్ కిట్ హిట్..
కేసీఆర్ కిట్స్ పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 నుంచి 56 శాతానికి పెరిగాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇది మరింత పెరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. వంద శాతం ఇన్స్స్టిట్యూషన్ డెలివరీలు జరిగేలా చూడాలన్నారు. ఎన్సీడీ స్క్రీనింగ్ పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. డేటా ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని, టీబీ ఫ్రీ స్టేట్ అయ్యేందుకు మనం దగ్గర్లో ఉన్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల మలేరియా నియంత్రణకుగానూ తెలంగాణకు కేంద్రం నుంచి అవార్డు వచ్చిందని, ఈ విషయంలో కేటగిరీ 2 నుంచి 1కి వచ్చామన్నారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ.. దవాఖానలకు కాయకల్ప, లక్ష్య, క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్స్ వచ్చేలా చూడాలని మంత్రి హరీశ్రావు సూచించారు. దవాఖానల్లో పారిశుధ్యం, డైట్ సేవలను సమీక్షించాలన్నారు. బడ్జెట్లో చార్జీలను పెంచామని, పాత టెండర్ల గడువు పూర్తయిపోయిందని తెలిపారు. వెంటనే శానిటేషన్, డైట్ టెండర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 636 పీహెచ్సీలు, 232 అర్బన్ పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇవి పూర్తయితే జిల్లా కలెక్టర్లు సైతం పరిశీలించే వెసులుబాటు ఉంటుందన్నారు.
రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి, 15-17 ఏళ్ల కేటగిరీ, 12- 14 ఏళ్ల కేటగిరీలో వంద శాతం కొవిడ్ వాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీల పనులు, దవాఖాన అప్గ్రేడేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాలని చెప్పారన్నారు. ల్యాండ్ అలాట్మెంట్ ప్రతిపాదనలు త్వరగా పంపాలని ఆదేశించారు. వడగాలుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. దవాఖానల్లో తాగునీటి వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు.
ప్రభుత్వ దవాఖానల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి: సీఎస్
తెలంగాణలో వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. ఈ క్రమంలో అవసరమైన నిధులు అందిస్తున్నారని వెల్లడించారు. నెలలో ఏదో ఒక రోజు కలెక్టర్లు వైద్యారోగ్యంపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలన్నారు. ఎక్కడికి వెళ్లినా సమీపంలోని దవాఖానలను ఆకస్మిక తనిఖీచేయాలని ఆదేశించారు. సోమవారం బీఆర్కే భవన్లో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్లో కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎం ఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.