మల్యాల, మార్చి 4: ఒకే సామాజిక వర్గం.. దూరపు బంధువైన ఓ యువతిని ప్రేమించాలని వేధించిన ఘటనలో యువకుడు యువతి కుటుంబసభ్యుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడు కత్తితో దాడి చేయగా యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో జరిగింది. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన భోగ మహేశ్(25) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి దూరపు బంధువు అయిన మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాలని వేధించడంతో ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు ఇటీవలే మల్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా.. మహేశ్లో మార్పు రాలేదు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి వెళ్లాడు.
ఈ క్రమంలో కొద్దిసేపు మహేశ్కు, యువతి కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మహేశ్ వెంట తెచ్చుకున్న కత్తితో యువతి తాత నర్సయ్యను ఛాతీలో పొడిచాడు. యువతి తల్లి భైరి సత్తవ్వ తొడపై, యువతి తమ్ముడు మనోజ్ చేతిపై పొడిచాడు. అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు ప్రతిఘటించి బండరాయితో మహేశ్ తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన యువతి కుటుంబ సభ్యులను స్థానికులు 108 ద్వారా జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న మల్యాల సీఐ దామోదర్రెడ్డి, ఎస్సై అబ్దుల్హ్రీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ జగిత్యాల ఏరియా దవాఖానకు వెళ్లి క్షతగాత్రులను, మృతదేహాన్ని పరిశీలించారు. ఇరు కుటుంబాల సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు మల్యాల సీఐ దామోదర్రెడ్డి తెలిపారు.