నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 21: రెండో విడుత గొర్రెలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్ల, కుర్మలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలి విడుత రూ.5 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడుత పంపిణీకి రూ.6 వేల కోట్లు విడుదల చేయడంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసి సంబురాలు జరుపుకొన్నారు. హైదరాబాద్లోని కురుమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం తదితరులు, తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్క్లబ్ ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో, జమ్మికుంటలో యాదవ సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో నాయకులు నూనె కుమార్యాదవ్, రామచంద్రంయాదవ్, బాలమల్లు యాదవ్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.