హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఎందరో మహనీయుల పోరాటాలు, మరెందరో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్య్ర ఫలాలు చివరి గడపకూ చేరిననాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ పోరాట స్ఫూర్తితో శాంతియుతమార్గంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ప్రజల సహకారంతో పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేరొన్నారు. అన్నిరంగాల్లో సబ్బండ వర్గాల అభ్యున్నతి దిశగా దేశ పాలకులు కార్యాచరణను మరింత చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఆ ఫలితాల సాధన ద్వారానే స్వాతంత్య్ర పోరాట త్యాగధనులకు మనం అర్పించే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.