హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobhayatra) ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరంలో యజ్ఞంతో హనుమాన్ పూజలను ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర రామ మందిరం నుంచి మొదలైంది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బన్సీలాల్ పేట్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు 13 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద సామూహిక హనుమాన్ చాలీసా పఠనం, ముఖ్య అతిథులతో బహిరంగ సభ నిర్వహిస్తారు. కర్మాన్ఘాట్, సైదాబాద్, మలక్పేట తదితర ప్రాంతాల నుంచి వచ్చే ఇతర ర్యాలీలు కోఠిలో ప్రధాన యాత్రతో కలుస్తాయి.
గౌలిగూడ రామ మందిరం నుంచి పుత్లీబౌలి చౌరస్తా, కోటి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా, డీఎంహెచ్ఎస్ సుల్తాన్బజార్ క్రాస్రోడ్స్, రామ్కోఠి క్రాస్రోడ్, కాచికూడ క్రాస్రోడ్, నారాయణగూడ వైఎంసీఏ మీదుగా చిక్కడపల్లి క్రాస్రోడ్స్, ఆర్టీసీ క్రాస్రోడ్, అశోక్నగర్, గాంధీనగర్ బ్యాక్సైడ్ వైస్రాయ్ హోటల్, కవాడిగూడ, బన్సీలాల్పేట, బైబిల్ హౌస్, రామ్గోపాల్పేట, ప్యారడైజ్ నుంచి తాడ్బండ్ హనుమాన్ దేవాలయానికి యాత్ర చేరుకుంటుంది.
మరోవైపు శోభాయాత్రకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీస్తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ను మళ్లించారు. దాదాపు 44 చోట్ల ట్రాఫిక్ను మళ్లిస్తున్నామని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.