కొండగట్టులో 31 రోజులకు చేరిన కార్యక్రమం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ‘రామలక్ష్మణ జానకీ..జైబోలో హనుమాన్కీ’నామస్మరణతో కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రం మారుమోగిపోతున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం 31 రోజులు పూర్తి చేసుకున్నది. ప్రతీరోజూ సాయంత్రం 5.30 నుంచి గంటపాటు రాష్ట్రంలోని దేవాలయాలతోపాటు ప్రతీ ఇంట్లో 11సార్లు చాలీసా పారాయణంతో ఆధ్యాత్మిక శోభ వెల్లిరిస్తున్నది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్న సంకల్పంతోపాటు ఆధ్యాత్మిక భావనను పెంపొందించటమే లక్ష్యంగా మార్చి 17న కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టిన విషయం తెలిసిందే. జూన్ 4న హనుమాన్ జయంతి సందర్భంగా 11 కోట్ల శ్రీరామ నామ పుస్తకాలను అంజన్నకు సమర్పించనున్నారు. 11 కోట్ల రామకోటి లిఖిత ప్రతులను సిద్ధం చేసే బృహత్కార్యంలో భక్తులు భారీఎత్తున భాగస్వామ్యం అవుతున్నారు. 82 రోజుల పాటు జరిగే ఈ పారాయణంలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం కొండగట్టులో పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. కొండగట్టుపై హెలీప్యాడ్, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్, 60 తాత్కాలిక బాత్రూమ్స్ ఏర్పాటుచేస్తున్నారు. దేవస్థానం ఆవరణలో రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామకోటి స్థూపం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్ద హనుమాన్ జయంతి నాటికి ఈ స్థూప నిర్మాణం పూర్తి అవుతుందని అంచనా వేశారు.
ఇండ్లల్లోనూ పండుగ శోభ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కొండగట్టు ఆంజన్న సన్నిధిలో అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో గత 31 రోజుల నుంచి జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో ప్రతీ ఇంటి నుంచి భక్తులు భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉన్నది. 11 కోట్ల రామకోటి ప్రతులను సిద్ధం చేయటంలో భక్తులు చురుగ్గా పాల్గొంటున్నారు.