హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని అఖిల భారత పద్మశాలి సంఘం స్పష్టం చేసింది. జీరో జీఎస్టీ ఉద్యమంలో భాగంగా గుజరాత్లోని దండి మార్చ్ స్మారక చిహ్నం వద్ద సంఘం నేతలు శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు.
చేనేతపై జీరో జీఎస్టీ కోరుతూ ఎంపీలు సంతకాలు చేసిన వస్త్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ బ్రిటీష్ పాలకులు ఉప్పుపై వేసిన పన్నును రద్దు చేయాలంటూ గాంధీ చేపట్టిన దండి మార్చ్ స్ఫూర్తితో జీరో జీఎస్టీ కోసం పోరాడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధానకార్యదర్శి జగన్నాథం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న, నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ పాల్గొన్నారు.