రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం సృష్టించారు. గుంటూరుకు చెందిన రత్నకుమారి-కోటేశ్వరరావు ప్రత్యేకంగా ఇచ్చిన ఆర్డర్ మేరకు 45రోజులపాటు శ్రమించి, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దివ్యచరిత్రను పట్టుచీరపై అద్భుతంగా ఆవిషరించారు. ఈ ప్రత్యేక పట్టుచీరలో 102 మంది రుషుల పేర్లు, 102 గోత్రనామాలు, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రను ప్రతిబింబించే 25 చారిత్రక చిత్రాలను చేనేత మగ్గంపై అత్యంత నైపుణ్యంతో నేశారు. ఒకో అక్షరం, ఒకో చిత్రం, ఒకో గోత్రనామాన్ని మగ్గంపై పొందుపర్చడం ద్వారా హరిప్రసాద్ తన చేనేత ప్రతిభను మరోసారి చాటుకున్నారు.
ఈ అరుదైన కళాఖండాన్ని పూర్తిగా పట్టుదారం, రెండు గ్రాముల బంగారు జరి ఉపయోగించి రూపొందించారు. ఏడు మీటర్ల పొడవు కలిగిన ఈ పట్టు చీరలో భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, చేనేత కళా నైపుణ్యంతో తయారు చేయడం విశేషం. హరిప్రసాద్ ఇటీవలే 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత మగ్గంపై నేసి ఔరా అనిపించారు.