హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పురపాలక, చేనేత,జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకొంటుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారిపై మోయలేని భారం వేస్తున్నదని విమర్శించారు. చేనేతపై జీఎస్టీని ఉపసంహరించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పోస్టుకార్డు రాసి ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఆదివారం ఆన్లైన్ పిటిషన్ను ప్రారంభించారు. అనంతరం దీన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. చేంజ్.ఆర్గ్లో ఆన్లైన్ పిటిషన్పై ప్రతిఒక్కరూ సంతకం చేయాలని.. స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ మహోన్నత లక్ష్యం కోసం ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
యాంత్రిక శక్తి లేకుండా ప్రత్యేకమైన ఉత్పత్తులను తయారు చేసే దాదాపు 50 లక్షల మంది చేనేత కార్మికులు దేశంలో నివసిస్తున్నారని, ఇది గ్రామీణ ఆధారిత పరిశ్రమ అని, ఈ రంగంలో మహిళలు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. జీఎస్టీ విధింపు వల్ల చేనేత రంగాన్ని నమ్ముకొన్న లక్షల మంది ఉపాధికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని, ఈ పన్ను విధింపును దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల చేనేత రంగం భారీ నష్టాల్లో కూరుకుపోవడమే కాకుండా చాలామంది వృత్తి నుంచి వైదొలగాల్సివచ్చిందని తెలిపారు. కొవిడ్ ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న దశలో పన్ను విధించే చర్య ఆ రంగానికి మరణశాసనం లాంటిదని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత చేనేతపై జీఎస్టీ విధించిన తొలి ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారేనని ధ్వజమెత్తారు.
చేనేత వృత్తి వ్యాపారం కాదని, మన దేశ వారసత్వ కళాసంపద అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ఆదివారం ప్రధాని మోదీకి ఆమె పోస్టుకార్డు రాశారు. చేనేత కళాకారుడి నైపుణ్యత, సృజనాత్మకత, కష్టంపై ఆధారపడి పరిశ్రమ మనుగడ సాగిస్తున్నదని, దీన్ని వ్యాపారంగా భావించడం సరికాదని పేర్కొన్నారు.
మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించి, దాన్ని 12 శాతానికి పెంచాలనుకోవడం అత్యంత దుర్మార్గమని తెలిపారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని, జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతిఒక్కరూ ప్రధానికి పోస్టుకార్డు రాయాలని కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మోదీ నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ తీసుకొంటున్న నిర్ణయాలతో చేనేత రంగం అంధకారంలోకి కూరుకుపోతున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో చేనేతపై 5శాతం జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రవిశంకర్ ప్రధానికి లేఖ రాశారు.
ప్రజాప్రతినిధిగా, కార్మికుల సంక్షేమాన్ని కోరే వ్యక్తిగా చేనేత కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా జీఎస్టీని సంపూర్ణంగా రద్దు చేసి చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన పోస్ట్కార్డు ఉద్యమానికి మునుగోడు నియోజకవర్గంలో సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మోదీకి పోస్ట్ కార్డుపై చేనేత కార్మికులు యుద్ధాన్ని ప్రకటించారు. తమ వృత్తిపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని నినదిస్తూ నేతన్నలు ఉద్యమం చేపట్టారు. అందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్థానిక నేత కార్మికులతో కలిసి ప్రధాని మోదీకి ఉత్తరం రాశారు.
ఎమ్మెల్యేతోపాటు స్థానిక నేత కార్మికుడు బత్తుల నారాయణ, గుర్రం శ్రీనివాస్, గుర్రం పాండు, కర్నాటి భిక్షపతి, తిరందాస్ రమేష్ తదితరులు ఉత్తరాలు రాశారు. వీరి బాటలో గట్టుప్పల్, చౌటుప్పల్, మర్రిగూడ మండలాలకు చెందిన వేలాది మంది నేత కార్మికులు మోదీకి పోస్ట్కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నకిరేకల్ సిల్క్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రధానికి పోస్టుకార్డులు పంపించారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన నేతన్న బత్తుల నారాయణ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి ప్రధాని మోదీకి పోస్ట్కార్డు రాశారు.