Group-1 Jobs | సుబేదారి, మార్చి 29 : తెలుగు రాష్ర్టాల్లో గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.4.5 కోట్లు వసూలు చేసి ఓ ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలో ముఖ్య పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు కొత్త వీరేశంను శుక్రవారం హనుమకొండలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సుబేదారి పోలీస్స్టేషన్లో హనుమకొండ ఏసీపీ జితేందర్రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ పిన్నావారి వీధికి చెందిన కొత్త వీరేశం మొదట్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పైరవీలు చేసి డబ్బులు తీసుకునేవాడు.
వీరేశం కుమారుడు గోపీనాథ్కు హైదరాబాద్ ఎల్బీనగర్ రాక్ టౌన్కాలనీకి చెందిన గూడూరు పవన్కుమార్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరేశం, పవన్కుమార్ ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లను పరిచయం చేసుకున్నారు. ఆ వైద్యుల పేరుతో వీరేశం, పవన్కుమార్ ఏపీ, తెలంగాణలో ప్రముఖులు, ఉన్నతాధికారులను కలిసేవారు. ఈ క్రమంలో గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలుగు రాష్ర్టాల్లో చాలామంది నుంచి రూ.4.5 కోట్ల వసూలు చేశారు. ముఠాలో ప్రధాన నిందితుడు వీరేశంను అరెస్ట్ చేసి విచారణ చేయగా ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్లో చాలాకాలం పనిచేసి మృతిచెందిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ భాస్కర్రావు భార్య శ్రీదేవి కూడా ముఠా బాధితుల్లో ఉన్నారు. శ్రీదేవి తన కుమారుడికి ఏపీలో గ్రూప్-1 పోస్ట్ కోసం రూ.2.5 కోట్లు ఇచ్చినట్టు పోలీసు విచారణలో తేలింది. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతున్నదని ఏసీపీ తెలిపారు. కాగా, పోలీసులు వీరేశం నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బ్యాంకు పాస్బుక్లు, ప్రామిసరీ నోట్స్, 3 పాస్పోర్ట్లు, రూ.71,700 నగదు స్వాధీనం చేసుకున్నారు.