Half Day Schools | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయని వెల్లడించారు. ప్రతి పని దినం నాడు 12.30 గంటలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. పదోతరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.