హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖానలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు తెలంగాణ సర్కారు పడుతున్న తపన, కల్పిస్తున్న సౌకర్యాలను చూసి ‘మేము సైతం’.. అంటూ హెచ్ఏఎల్ సంస్థ ముందుకొచ్చింది.
సీఎస్ఆర్ కింద రూ.9.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను హాస్పిటల్కు విరాళంగా ఇచ్చింది. ఇందులో హై అండ్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ పరికరాలు, ఓటీ టేబుళ్లతో పాటు ఇతర పరికరాలు, థామ్సన్ లివర్ రిట్రాక్టర్, కంటిన్యూస్ కార్డియాక్ ఔట్పుట్ మానిటరింగ్ ప్లాట్ఫామ్, హై ఎండ్ అనస్థీషియా వర్క్ స్టేషన్ తదితర వైద్యపరికరాలు ఉన్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు.
ఈ పరికరాలను శుక్రవారం సంస్థ నుంచి లాంఛనంగా స్వీకరించి, రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. అత్యంత ఖరీదైన వైద్యపరికరాలు అందుబాటులోకి రావడంతో ఇప్పటికే కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న ఉస్మానియాలో ఇక మరింత మెరుగైన వైద్యం అందించనున్నట్టు నాగేందర్ తెలిపారు.