హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి హిందూస్థాన్ ఏరో నాటికల్ (హెచ్ఏఎల్) ముందుకు వచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.17 కోట్లను మంజూరుచేసింది. ఈ మేరకు హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ సర్కాటే, ఇతర ప్రతినిధులు శనివారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అంగీకార పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా హెచ్ఏఎల్ ప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో సీఎం కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని, దాదాపు ఏటా సుమారు 6 లక్షల మంది నిరుపేద విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నారని కొనియాడారు.
బాలికల చదువు అర్ధాంతరంగా ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా 30 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో భాగంగా కొనసాగుతున్న జగద్గిరిగుట్ట పాఠశాల, కాలేజీకి శాశ్వత భవనాన్ని సమకూర్చేందుకు హెచ్ఏఎల్ ముందుకొచ్చి నిధులు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సంస్థలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, హెచ్ఏఎల్ జీఎం అరుణ్ సర్కాటే, అధికారులు రాంకిశోర్, సురేందర్, జీ జితేందర్పాల్ కౌర్, ప్రహ్లాద్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ అధికారులు హన్మంతునాయక్, మామిడాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.