నల్లగొండ : సాగునీటి రంగంలో తెలంగాణ సంపూర్ణ అభివృద్ధిని సాధించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి లో సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్(Cheif Minister KCR)కే దక్కిందన్నారు.
వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగెల్లుతున్న చెరువులూ, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీజలాలు సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయన్నారు.
స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగం(Irrigation Sector) స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని తెలిపారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నదని అన్నారు.
రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించి దేశానికే అన్నం పెడుతున్నదని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగిందని, రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలయిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్(CM KCR)నాయకత్వమే శ్రీ రామ రక్షా అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మి అధికారం అప్పగిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తారుగా మారుతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో ఇప్పటికే సీఎం పదవి కోసం పాతికమంది కొట్టుకుంటున్నారని విమర్శించారు.
జిల్లాలో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు 674 కోట్ల 67 లక్షల రూపాయల అంచనాతో ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభించి ఇప్పటి వరకు 524 కోట్ల 92 లక్షల రూపాయలు ఖర్చు చేశారని వివరించారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ (Dindi Lift Irrigation) పథకం క్రింద జిల్లాలో మొత్తం ఆయకట్టు 3 లక్షల 61 వేల ఎకరాలకు నీరు అందించేందుకు 6 వేల 190 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించి 2 వేల 882 కోట్ల 21 లక్షల రూపాయలు ఖర్చు జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇరిగేషన్ శాఖ సీఈ అజయ్ కుమార్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, రిటైర్డు సీఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్ రమణ నాయక్, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.