మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలో గమ్యం, గమనం లేని నాయకుడు భట్టి విక్రమార్క అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy ) ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సమూహం కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress)లో ఆధిపత్యం కోసం రోజుకు 3 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తున్నారని, ఈ పాదయాత్రకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు.
పబ్లిసిటీ(Publicity) కోసం తనపైనా, మంత్రి జగదీశ్రెడ్డిపైనా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటిని అందించేందుకు డిండి ప్రాజెక్టు(Dindi Project)ను త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్(Green Tribunal)లో కేసులు వేశారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పూర్తికావొస్తుందని, ఇంకా 9కిలో మీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి కండ్లు ఉన్న కబోధి అని ఆరోపించారు. నల్లగొండ ఎంపీగా నాలుగు సంవత్సరాల్లో ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్రం నుంచి ఏం సాధించుకొని తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉత్తమ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క ఒక్క రోజు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేయలేదని ఆరోపించారు. వీరందరూ తెలంగాణ ద్రోహులేనని విమర్శించారు. తాను పది సంవత్సరాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేశానని, కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిని సాధించానని వెల్లడించారు. రెండు కేంద్రీయ విద్యాలయాలను సాధించానని తెలిపారు. ఆంధ్రా నాయకులకు సంచులు మోసిన వారు నేడు తమపై ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. తొమ్మిదేండ్లలో కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. కేవలం కాల్వలు తవ్వి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
తమకు ఒక్కడే కేసీఆర్ నాయకుడని, ఒక్కటే ఎజెండా అని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు అసమర్ధులు కాబట్టే ఢిల్లీ వైపు చూస్తున్నారని, కేసీఆర్ సమర్ధుడు కాబట్టే ఢిల్లీనే ఆయన వైపు చూస్తున్నదని తెలిపారు. బీజేపీ నేత విద్యాసాగర్రావు హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అని అనడం సబబుకాదని అన్నారు. రెండో రాజధానిని ఉత్తర భారతదేశంలో పెట్టుకోవాలని, లెఫ్ట్నెంట్ గవర్నర్ పెత్తనం తమకు అక్కర్లేదని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పూటకోమాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.