చౌటుప్పల్, మే 21 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తుచేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 వేల నోట్లను ఉపసంహరించుకోవడం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యగా ఆయన పేర్కొన్నారు. గతంలోనూ నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు మరోసారి రద్దు చేసి అదే పని చేస్తున్నారని మండిపడ్డారు. 2 వేల నోట్లను ఎందుకు ఉపసంహరించారో? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ రహస్య ఎజెండా ఉన్నదని, మోదీ సన్నిహితులకు లాభం చేకూర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ దోస్తుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.