నల్లగొండ, జనవరి 9: బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అడ్డదారిలో పదవి పొందిన విషయం లోకానికి తెలుసన్నారు. ఎన్నో కుం భకోణాలు చేసిన వ్యక్తిని బీజేపీ ముఖ్యమంత్రిని చేసిందని ఆరోపించారు. అలాంటి వ్యక్తులు కావాలనే సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఆదివారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా మీడియా తో మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రధానికి కూడా అవమానం జరగలేదని, నరేంద్ర మోదీ తన ప్రవర్తన కారణంగానే పంజాబ్లో వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. దేశంలో శాంతి భద్రతలు లోపించాయనే దానికి ఇదే కారణమని చెప్పారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వారికి ఎవరూ ఓట్లు వేయరని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా దారుణంగా త యా రైందని, ఆ పార్టీలోని వ్యక్తులు అలీ బాబా 40 దొంగల్లా తయారయ్యారని ఎద్దేవా చేశా రు. బండి సంజయ్ ఏమైనా స్వాతంత్య్ర సమర యోధుడా? ఎందుకు ఆయన్ను బీజేపీ అధిష్ఠానం హీరోను చేస్తున్నదని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన బీజేపీ ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దీన్ని మరిచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు 1.42 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు.