హైదరాబాద్, మార్చి 5: (నమస్తే తెలంగాణ): గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. భవిష్యత్ తరాలకు వారి సాంస్కృతిక వారసత్వాన్ని అందించేందుకు నిర్ణయించింది. పాఠశాల స్థాయిలో గుస్సాడీ నృత్యం, డోలీ వాయిద్యాన్ని విద్యార్థులకు నేర్పిస్తున్నది. ఇద్దరు పద్మశ్రీ అవార్డు గ్రహీతల సారథ్యంలో ఈ బృహత్తర కార్యాన్ని చేపట్టింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో గోండు సంస్కృతికి ప్రతిరూపంగా ఉన్న గుస్సాడీ నృత్యాన్ని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కోయజాతి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న డోలీ వాయిద్య కళలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నది. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ కేంద్రాల్లో ప్రత్యేక పీఠాలను (చాంబర్స్) ఏర్పాటు చేసింది. ఉట్నూరులో గుస్సాడీ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, భద్రాచలంలో డోలీ వాయిద్యకారుడు సకిని రామచంద్రయ్య సారథ్యంలో ఆశ్రమ, గురుకుల పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నది.
వారసత్వ ప్రతీకలకు సర్కారు పబ్బతి
ఆదివాసీ యోధుడు కుమ్రంభీం, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంతోపాటు నాగోబా, జంగుబాయి, బరంపూర్ ఎరుకల నాంచారమ్మ, గాంధారి మైసమ్మ వంటి జాతరలను ప్రభుత్వమే జరుపుతున్నది. ఈ జాతరల నిర్వహణ కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.354 కోట్లు ఖర్చు చేసింది.
అలాగే కొమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడెఘాట్లో కుమ్రంభీం స్మారక కేంద్రంతో రూ.50 కోట్లతో మ్యూజియం నెలకొల్పింది. ములుగు జిల్లా మేడారంలో సమ్మక సారలమ్మ మ్యూజియం ఏర్పాటు చేసి, కోయ తెగ సంస్కృతీసంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్నది. రూ.100 కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్లో ఆదివాసీ, బంజారాల ఆత్మగౌరవ భవనాలను నిర్మించింది.
శిక్షణ.. ప్రదర్శన
ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏల పరిధిల్లోని ఆశ్రమ, గురుకుల పాఠశాల స్థాయిలో గుస్సాడీ నృత్యంలో, డోలీ వాయిద్యంపై విద్యార్థులు అవగాహన కల్పించి ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించింది. శిక్షణ కాలంలో ఆయా ప్రాంతాల్లోని జాతరలు, ఉత్సవాల్లో ఈ విద్యార్థులతో ప్రదర్శనలు ఇప్పించాలని గిరిజన సంక్షేమశాఖ భావిస్తున్నది. రెండు ఐటీడీఏ కార్యాలయాల్లో గుస్సాడీ (ఉట్నూరు), డోలీ (భద్రాచలం) వాయిద్య శిక్షణ విభాగాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.